
- హనుమకొండ జిల్లా సూరారంలో ఘటన
ఎల్కతుర్తి, వెలుగు : అప్పుల కారణంగా ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బచ్చు రామారావు, లక్ష్మి (48)కి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. రామారావు లక్ష్మి దంపతులు తమకున్న నాలుగు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవించేవారు.
ఐదేండ్ల కింద కొంత అప్పు చేసి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. అదే సమయంలో కూతురికి వివాహం చేయడంతో అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రామారావు తాగుడుకు బానిస అయ్యాడు. మద్యం మానేయాలని లక్ష్మి ఎంత చెప్పినా అతడు వినకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అప్పులు ఎక్కువ కావడంతో పొలాన్ని అమ్మి అప్పు తీర్చేశారు.
తర్వాత రామారావు హనుమకొండలోని ఓ బంక్లో పని చేస్తుండగా, లక్ష్మి గ్రామంలోనే కూలీ పనులకు వెళ్తోంది. అప్పుల కారణంగా ఉన్నదంతా అమ్ముకున్నామని, పిల్లలకు ఆస్తి లేకుండా చేశామన్న మనస్తాపంతో లక్ష్మి బుధవారం రాత్రి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకుంది. అరుపులు విన్న చుట్టుపక్కల వారు మంటలను ఆర్పేసి 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ బుధవారం అర్ధరాత్రి చనిపోయింది. కుమారుడు రోహిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎల్కతుర్తి ఎస్సై అక్కెనపల్లి ప్రవీణ్కుమార్ తెలిపారు.